భక్తిని బోధించే రామాయణం, భారతం, శ్రీమద్భాగవతం మొదలైన ఇతిహాస పురాణాలు ఆయా భాషల్లో మహాకవులచే కావ్యరూపంలో అనువదించబడినవి. వాటిని అందరూ అర్ధం చేసుకోవడం కష్టం. ఈ కథలను సామాన్య జనులకు కూడా అర్థమయ్యేలా సులభమైన శైలిలో దృశ్యంగా మలిస్తే పండిత పామరజనులందరూ భక్తిమంతులుగానూ, నీతిమంతులుగానూ అవుతారు. అందులోనూ సంగీత, నాట్యాలతో మేళవించి చక్కని సులభమైన సాహిత్యంతో అందిస్తే సర్వజనులూ ఆనందంతో పరవశులౌతూ భక్తిమార్గమందు ఆసక్తులౌతారు.
ఈ విధమైన లక్ష్యంతో రూపొందిన సాహిత్య సంగీత నాట్యముల మేళవింపు భాగవతమేళముగా ప్రసిద్ధి చెందింది. భగవద్భక్తిని ఏర్పరచే నాట్య, సంగీత ప్రక్రియ కాబట్టి దీనికి భాగవతమేళం అనీ, వీటిల్ని ప్రదర్శించే వారికి భాగవతులనీ పేరు. ఇవి ముఖ్యంగా దేవాలయాల్లో ప్రదర్శింపబడేవి. భాగవతమేళ నాట్యనాటకములు పండిత పామర భేదం లేకుండా సర్వజనులకీ భక్తిరసాస్వాదం కలిగించి దైవ చింతనను పెంపొందించేవి. ఇక్కడ రూపకము అనే అర్థంలో నాటకము అనే పదం వాడుకలోకి వచ్చింది.

